కరోనాతో ఢిల్లీ అల్లర్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం: మమతా బెనర్జీ

  • కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం సంచలన ఆరోపణలు
  • ప్రభుత్వం చెబుతున్నంత ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి లేదు
  • ప్రజల్లో ఇంతగా భయం పుట్టించాల్సిన అవసరం లేదన్న మమత
కరోనా వైరస్‌ వ్యాప్తి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ హింసపై ప్రజల దృష్టిని మరల్చేందుకే దేశంలోకి కరోనా వచ్చిందని ప్రజల్లో భయం సృష్టిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ఈ రోజు కొంత మంది కరోనా అంటూ పెద్దగా అరుస్తున్నారు. కానీ, వాళ్లు చెబుతున్నంత ప్రమాదంగా కరోనా లేదు.

అది భయంకరమైన వ్యాధి అయినప్పటికీ, ప్రజల్లో ఇంతగా భయం పుట్టించాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని న్యూస్‌ చానళ్లు ఢిల్లీలో జరిగిన ఘటనలను అణగదొక్కేందుకు వైరస్‌పై అతిగా ప్రచారం చేస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తి చెందాలని మనం అనుకోకూడదు. కానీ, ఢిల్లీ అల్లర్లలో మృతి చెందిన వాళ్లు  ఈ వైరస్‌ కారణంగానే చనిపోలేదని మనం గుర్తుంచుకోవాలి.

ఒకవేళ ఎవరైనా కరోనా సోకి చనిపోతే కనీసం వాళ్లు ఓ భయంకరమైన వైరస్ కారణంగా మరణించారని మనకు తెలుస్తుంది. కానీ, కొంతమంది ఆరోగ్యవంతులను కనికరం లేకుండా చంపారు. దీనికి వాళ్లు (బీజేపీ) ఇప్పటిదాకా క్షమాపణ కూడా చెప్పలేదు. వాళ్లది ఎంత అహంకారమో అర్థం చేసుకోండి. పైగా గోలీ మారో అంటున్నారు. అలాంటి వాళ్లు బెంగాల్, యూపీ రెండూ ఒకటి కాదని తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నా’ అని బుధవారం జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన మమత పేర్కొన్నారు.

Coronavirus
divert attention
Delhi riots
Mamata Banerjee
West Bengal
BJP

More Telugu News